సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ 2020 ఎడిషన్ కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ యూఏఈలో ఉన్నాయి. అక్కడికి జట్లు చేరి దాదాపుగా వారంపైనే గడుస్తోంది. మరోవైపు ప్లేయర్లందరూ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. టోర్నీ ప్రారంభ తేదీ కూడా సమీపిస్తోంది. అయినప్పటికీ బీసీసీఐ ఇంకా ఐపీఎల్ షెడ్యూల్ను విడుదల చేయలేదు. అయితే దీనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా త్వరగా షెడ్యూల్ను విడుదల చేయాలని బీసీసీఐపై ఒత్తిడి తెస్తున్నాయి.
ఐపీఎల్ షెడ్యూల్ను త్వరగా విడుదల చేస్తే తాము మ్యాచ్ లు జరిగే స్టేడియాలను బట్టి అరేంజ్మెంట్స్ చేసుకుంటామని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరుతున్నాయి. అయితే మ్యాచ్ లు జరగనున్న దుబాయ్, అబుధాబి, షార్జాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అంతర్ రాష్ట్ర రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. దీని వల్లే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఫ్రాంచైజీలు మాత్రం ఐపీఎల్ షెడ్యూల్ను విడుదల చేయాలని బీసీసీని కోరుతున్నాయి. దీంతో బీసీసీఐ గందరగోళంలో పడినట్లు తెలిసింది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు వరుసగా కరోనా బారిన పడుతుండడంతో సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్కే ఆరంభ మ్యాచ్ జరుగుతుందా, లేదా అని సందేహాలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్ షెడ్యూల్ను సోమవారం లేదా మంగళవారం వరకు విడుదల చేయవచ్చని సమాచారం అందుతోంది. దీనిపై బీసీసీఐ స్ఫష్టత ఇచ్చే అవకాశం ఉంది. కేవలం మరో 19 రోజులే సమయం ఉన్నందున ఈపాటికే షెడ్యూల్ను విడుదల చేయాల్సి ఉందని ఫ్రాంచైజీలు అంటున్నాయి. అయితే బీసీసీఐ దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది.