పుల్వామా దాడి జరిగిన రోజు అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఒక షూటిింగ్లో ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. భయంకరమైన ఆ దాడి వార్త తెలియగానే దేశమంతా తల్లడిల్లుతుండగా ప్రధాని మాత్రం షూటింగ్కు వారామం ఇవ్వకుండా గడిపారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
‘ పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వీర జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలుస్తుంది. 1947, 1975, 1971 , 1999 లలో పాకిస్తాన్ ఇలాంటి ప్రయత్నాలు చేసింది కానీ మన జవాన్లు ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టారు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ప్రాయోజిత తీవ్రవాదానికి తగినట్లుగా సమాధానం ఇవ్వడానికి కాంగ్రెస్ సాయుధ దళాలను, ప్రభుత్వాన్ని సమర్ధించింది. కానీ మోది ప్రభుత్వానికి మాత్రం అధికార దాహం ఎక్కువ. ఫిబ్రవరి 17 న గువహతిలో మాట్లాడిన అమిత్ షా పుల్వామా దాడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై చౌకబారు వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వం, ఆర్మీ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తే..బిజెపి మాత్రం ప్రకటనలు విడుదల చేస్తున్నది.
దేశమంతా ఉగ్రదాడితో ఉలిక్కి పడితే..మోది మాత్రం ఆ సమయంలో కార్బెట్ నేషనల్ పార్క్లో డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ కోసం షూటింగ్ లో పాల్గొన్నారు. దేశమంతా దుఃఖంతో ఉంటే..మోది సుమారు నాలుగు గంటలపాటు బోటులో షికారు చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతే కానీ ఈ ఘటనపై జాతీయ సంతాపాన్ని ప్రకటించలేదు. ఎందుకంటే తన షూటింగ్ రద్దు చేసుకోవాల్సి వస్తుందని’ అని సూర్జేవాలా బిజెపి,మోదిపై విమర్శలు చేశారు.
‘ ఫిబ్రవరి 16 న జవాన్ల మృతదేహాలు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాయి. నివాళులు అర్పించేందుకు ప్రధాని గంట ఆలస్యంగా వచ్చారు. ఝాన్సీ లో వివిధ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన మోది..ముందు ఇంటికి వెళ్లి ఆ తరువాత మృతదేహాలకు నివాళులు ఆర్పించేందుకు వచ్చారు’ అని సూర్జేవాలా ఆరోపించారు. అలాగే, ఓ జవాను అంత్యక్రియల్లో పాల్గొన్న భాజపా ఎంపీ సాక్షి మహారాజ్.. ఆ సమయంలో నవ్వుతూ కనిపించరు. కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కూడా ఓ జవాను శవపేటికతో సెల్ఫీ తీసుకున్నారు’ అని ఆరోపించారు.