జీ – 20 సమ్మిట్ విజయవంతానికి రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న జి – 20 సమ్మిట్ జయప్రదమయ్యేలా చూసేందుకు సోమవారం రాష్ట్రపతి భవన్ నందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి మోడీ అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధ్యక్షుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు సమావేశంలో మాట్లాడారు.
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దాని కోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను అప్పగించినా నెరవేర్చేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్ని రకాలుగా తాము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న జీ – 20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ అతిధ్యం ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోడికి జగన్ అభినందనలు తెలియజేశారు. జీ – 20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన ఈ సందర్భంలో రాజకీయ కోణం లో వ్యాఖ్యలు చేయడం సరికాదనీ, అంతర్జాతీయ సమాజం దేశం వైపు చూస్తున్న తరుణంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, కానీ వాటిని మనవరకే పరిమితం చేసుకుని జీ 20 సదస్సు విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ప్రసంగించారు. దేశ ప్రగతిపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేయాలని సూచించారు. రాబోయే పాతికేళ్లలో భారత్ మొదటి లేదా రెెండో స్థానానికి చేరడం ఖాయమని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేాసారు. మన దేశానికి ఉన్న ప్రధాన బలం యువశక్తి అని తెలిపారు. వారికి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు తమ పాలసీలను రూపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానిస్తే అధ్భుతమైన ఫలితాలు అందుకోవచ్చని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు పేర్కొన్న నాలెడ్జ్ డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఉటంకించారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జై శంకర్, గోయల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్జే, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్, ఒడిశా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఏక్ నాథ్ శిండే, నవీన్ పట్నాయక్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజరై పలు సూచనలు, సలహాలు అందించారు. సమావేశం అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానితులందరితో కొద్దిసేపు విడివిడిగా మాట్లాడారు.