న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుల కేసును సుప్రీంకోర్టు ఈనెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ కాంగ్రెస్ ఎంపి సుస్మితా దేవ్ తరపున హాజరయిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, కోర్టుకు అదనపు పత్రాలు సమర్పించడానికి సమయం కావాలని కోరిన మీదట వాయిదా వేశారు.
మోదీ, షాలపై వచ్చిన కోడ్ ఉల్లఘన ఫిర్యాదులపై మే 6 లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గత విచారణ రోజున ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం నాలుగు ఫిర్యాదుల్లో మోదీకి, రెండు ఫిర్యాదుల్లో అమిత్ షాకు క్లీన్ చిట్ ఇచ్చింది. సోమవారం కేసు విచారణ సందర్భంగా సింఘ్వి, నిర్ణయాల విషయంలో ఎన్నికల సంఘంలో అసమ్మతి నమోదయిన విషయం ప్రస్తావించారు. ఇలాంటి ఫిర్యాదులపై భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవడంలో అనుసరించేందుకు తగిన మార్గదర్శకాలు సుప్రీంకోర్టు జారీ చేయాలని సింఘ్వి కోరారు. మోదీ విషయంలో ప్రదాన ఎన్నికల కమిషనర్ సుశీల్ అరోరా, మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర క్లీన్ చిట్ ఇవ్వగా, రెండో ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా విబేధించిన విషయం తెలిసిందే.