విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆదివారం నాడు సంక్రాంతి కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వర్చువల్ గా ఆయన జెండా ఊపి ప్రారంభించడంతో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి విశాఖకు బయలుదేరింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సికింద్రాబాద్ లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ రైల్వే శాఖ ప్రతి సంవత్సరం ప్రయాణీకుల సౌకర్యం కోసం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తొందని చెప్పారు. మారుతున్న దేశ భవిష్యత్తు కు వందే భారత్ రైలు ఒక ఉదాహరణ మాత్రమేనని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలందరికీ వందే భారత్ ట్రైన్ సంక్రాంతి కానుక అని అన్నారు. వందే భారత్ రైలు వేగంగా ప్రయాణీకులను తమ గమస్థానాలకు చేరుస్తుందన్నారు.
సికింద్రాబాద్ – విశాఖల మద్య ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రధాని మోడి అన్నారు. ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వే కు అత్యధిక ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. వందే భారత్ రైలు ప్రజలుకు భద్రతతో పాటు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. 2023లో ప్రారంభించిన తొలి వందే భారత్ రైలు ఇది అన్నారు. తక్కువ కాలంలో ఏడు వందే భారత్ ట్రైన్ లను ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో 24 పట్టణాల్లో కొత్త మెట్రో రైళ్లు ప్రారంభం అవుతాయని తెలిపారు. తెలంగాణలో గడచిన ఏనిమిదేళ్లలో అద్భుతమైన పనులు చేశామన్నారు. గతంలో రూ.250 కోట్లు పనులు చేస్తే ఇప్పుడు రూ.3వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మెదక్ సహా అనేక ప్రాంతాలకు రైల్వే వ్యవస్థతో కనెక్ట్ చేశామన్నారు. తెలంగాణలో రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ మూడింతలు పెంచామని తెలిపారు. ఏపిలో రైల్వే నెట్ వర్క్ ను పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపిలో ప్రతి ఏటా 220 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ చేస్తున్నట్లు తెలిపారు. 350 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్ ను ఏపిలో ఏర్పాటు చేశామని చెప్పారు.
సికింద్రాబాద్ – విశాఖ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వారంలో ఆరు రోజుల పాటు సేవలు అందిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుండి విశాఖ మధ్య ప్రయాణ సమయం 8.30 గంటలు కాగా చార్జీ రూ.1665లు టికెట్ చార్జీగా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుండి వరంగల్లుకు రూ.520లు, ఖమ్మం కు రూ.750లు, విజయవాడకు రూ.905లు, రాజమండ్రికి రూ.1365లు చార్జిగా నిర్ణయించారు. విశాఖ నుండి రాజమండ్రికి రూ.625లు, విజయవాడకు రూ.960లు, ఖమ్మంకు రూ.1115లు, వరంగల్లుకు రూ.1310లు చార్జీగా వసూలు చేస్తున్నారు. విశాఖ నుండి ప్రతి రోజు ఉదయం 5.45 గంటలకు వందే భారత్ రైలు ప్రారంభమై మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. ఈ వందే భారత్ రైలుకు ప్రయాణీకుల నుండి మంచి స్పందన కనబడుతోంది. శనివారం నుండి రిజర్వేషన్ ను అధికారులు ప్రారంభించగా, మంగళ,బుధవారం వరకే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని అధికారులు తెలిపారు.
Breaking: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం .. 40 మందికి పైగా మృతి.. విమానంలో అయిదుగురు భారతీయులు