ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర విడుదలపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చిత్రాన్ని వీక్షించి నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిపై సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. అందుకు ఈ నెల 22వ తేదీ వరకూ గడువును ఇచ్చింది.
‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఎలాంటి బయోపిక్లను ఎన్నికలు పూర్తయ్యేవరకూ విడుదల చేయొద్దని ఈ నెల 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ‘రాజకీయ పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ ప్రచారం చేకూర్చే ఏ బయోపిక్లూ థియేటర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదు’ అని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదల నిలిపివేయటంతో వచ్చే నష్టాల గురించి పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను స్వీకరించిన సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికెట్ను జారీ చేసింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోది పాత్రలో నటించారు. ఈ చిత్రం వాస్తవానికి ఈ నెల ఐదొవ తేదీన విడుదల కావల్సి ఉన్నది. వివిధ కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తున్నది.