ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర వివాదం మళ్ళీ సుప్రీం కోర్టుకు చేరింది.
‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఎలాంటి బయోపిక్లను ఎన్నికలు పూర్తయ్యేవరకూ విడుదల చేయొద్దని రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ‘రాజకీయ పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ ప్రచారం చేకూర్చే ఏ బయోపిక్లూ థియేటర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదు’ అని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదల నిలిపివేయటంతో వచ్చే నష్టాల గురించి పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు స్వీకరించింది. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ చేపడతామని తెలిపింది.
మోది బయోపిక్ విడుదలను నిలిపివేయాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు కాగా సుప్రీం కోర్టు ఆ పిటిషన్ను కొట్టి వేసింది. సినిమా విడుదల విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమనీ, ఎన్నికల సంఘమే దీన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికలు సమీపిస్తున్నందున సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో ఎన్నికల సంఘం రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలపై ఆంక్షలు విధించింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికెట్ను జారీ చేసింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోది పాత్రలో నటించారు.