సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఆయన జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఇంతకు ముందు సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించగా, ఇప్పుడు రెండో ట్రైన్ ను ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభ వార్తే. తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులు తక్కువ సమయంలో, ఉల్లాసంగా ప్రయాణం చేస్తూ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే సికింద్రాబాద్ నుండి తిరుపతికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రధాని మోడీ తొలుత రైలులో విద్యార్ధులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
తొలుత బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మోడీ ప్రత్యేకంగా కైసే హో.. సంజయ్ అని అప్యాయంగా పకలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల బండి సంజయ్ ను పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు తరలించడం తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చిన సంజయ్ ప్రధాని మోడీని స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు మొత్తం 32 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను అనుమతించారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రిమోట్ ద్వారా అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.1,350 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మోడీ .. రూ.7,850 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అయిదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైల్ చార్జీలు ఖరారు చేసిన రైల్వే శాఖ .. ఎంతంటే..?