లక్నో: రైతాంగానికి చేయూతనందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. యుపిలోని గోరఖ్పుర్లో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు నేరుగా పెట్టుబడి సాయంగా నగదు బదిలీ చేసే పథకం ఇది.
ఈ సందర్భంగా మోదీ పలువురు రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
సన్న, చిన్న రైతుల కోసం ఈ పథకం అమలు చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఈ పథకం వల్ల ఎంతో మంది రైతులకు లబ్ధి చేకూరనుందని మోది అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామని మోది చెప్పారు.
పలువురు రైతులకు మోడీ చెక్కులు అందజేశారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తొలివిడతగా యుపి, కర్నాటకలతో సహా 14 రాష్ట్రాలకు చెందిన కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొదటి విడత రెండు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మరో కోటి మంది రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుందని అధికారులు తెలిపారు.
ఒకొక్క రైతుకు ఏడాదికి ఆరువేలు ఇవ్వనున్నారు. మిగిలిన నాలుగు వేల రూపాయలను రెండు విడతల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి కేంద్రం 75వేల కోట్లు రూపాయలు వెచ్చిస్తుంది.