అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లో ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ కేంద్రాల టెండర్ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకున్నది. ఈ పనులకు 4.987 కోట్ల రూపాయలను ఇనిషియల్ బెంచ్ మార్క్ విలువగా ప్రభుత్వం నిర్ణయించగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ అంచనా విలువ కంటే 12.6 శాతం తక్కువగా 4.358 కోట్ల రూపాయలకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు 629 కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరుతోంది.
జలవనరుల శాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్ను దాఖలు చేసింది. ప్రీబిడ్ సమావేశానికి దాదాపు ఎనిమిది సంస్థలు హజరై సందేహాలు నివృత్తి చేసుకున్నా గడువు ముగిసే నాటికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలంటే జివో 67 ప్రకారం కచ్చితంగా రెండు సంస్థలైనా బిడ్ లు దాఖలు చేసి ఉండాలి. అయితే ఇనీషియల్ బెంచ్ మార్క్ కంటే తక్కువ ధరకే మేఘా కంపెనీ కోడ్ చేసినందున ఆ సంస్థకు వర్కులు కేటాయించడం సరైనదేనని పోలవరం చీఫ్ ఇంజనీర్ జలవనరుల శాఖకు తెలియచేశారు. దీనితో మేఘా కంపెనీకి పనులు అప్పగించేందుకు ప్రభుత్వం నిబంధనలను సడలించింది.
గతంలో 4.8 శాతం ఎక్సెస్ ధరకు ఈ టెండర్ కేటాయించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 154కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. ఈ పనులకు రివర్స్ టెండరింగ్ వెల్లడం వల్ల ప్రభుత్వానికి 782 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు అయ్యింది.
ఇంతకు ముందు పోలవరం 65వ ప్యాకేజీ పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్ టెండరింగ్లో 58.53కోట్ల రూపాయలు ఖజానాకు ఆదా అయిన విషయం తెలిసిందే.
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ వద్ద మిగిలిన 1,771.44 కోట్ల రూపాయల పనుల కోసం. 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 3216.11 కోట్ల రూపాయల పనుల కోసం తాజాగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ను నిర్వహించింది.