Tdp Ex minister: ఏపిలో టీడీపీ నేతలను కేసులు వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా మరో టీడీపీ మాజీ మంత్రి పై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు అయ్యింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరి కొందరు పార్టీ నేతలపై కేసు నమోదు చేశారు.
కృష్ణాజిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ లో ఉమాతో పాటు మరికొందరిపై సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదుకు కారణం ఏమిటంటే.. టీడీపీ పిలుపు మేరకు ఈ నెల 16న మైలవరంలో ఆందోళన నిర్వహించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం ప్రకటించాలన, కరోనా మృతుల కుటుంబాలకు పది లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన వారికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని, వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ, వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని తదితర డిమాండ్ తో తహశీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయితే కరోనా సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వీరిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఇటీవల కోవిడ్ నిబంధనలు అతిక్రమించి సమావేశం నిర్వహించారంటూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికార పార్టీ నేతలపై ఎటువంటి కేసులు నమోదు చేయని పోలీసులు.. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలపైనే కోవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ కేసులు నమోదు చేయడం పట్ల ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.