అమరావతి: జరిమానాల విధింపులో పోలీస్ అధికారుల పొరపాటు చర్యల కారణంగా అభాసుపాలవుతున్నారు. హెల్మెట్ ధరించలేదంటూ ట్రక్ డ్రైవర్కు చలానా పంపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒన్ టౌన్ ప్రాంతంలో జరిగింది. ఈ నెల 13వ తేదీన పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా టికె నారాయణ అనే లారీ డ్రైవర్కు 100 రూపాయల జరిమానా, (యూజర్ చార్జీ కలిపి 135 రూపాయలు) విధిస్తూ మంగళవారం చలనా పంపారు. ఈ చలానాపై హెల్మెట్ లేదన్న కారణం పేర్కొనడం అందరినీ విస్మయానికి గురి చేసింది. లారీ డ్రైవర్ నియమాలు పాటించలేదని పేర్కొనాల్సిన చోట పోలీస్ కంప్యూటర్ ఆపరేటర్ పొరబాటున హెల్మెట్ అని పేర్కొనడం ఈ గందరగోళానికి దారి తీసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసు అధికారుల పొరబాటు కారణంగా ఇటువంటి సంఘటనలు అక్కడక్కడా తరచు జరుగుతున్నాయి.
previous post
next post