Deep Sidhu : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు దృష్టిసారించారు.
జనవరి 26 కిసాన్ పరేడ్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద 44 కేసులను నమోదు చేసి, చాలా మందిని అరెస్టు చేశారు. ఎర్రకోట దగ్గర జరిగిన ఘటనలతోపాటు పలు కేసులను క్రైం బ్రాంచ్ సెల్కు అప్పగించి వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిధు సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు బుధవారం ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.కాగా ఈ ఘటనల్లో దీప్ సిధుతోపాటు మరికొంత మందికి సంబంధముందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సిధుతోపాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జాంత్ సింగ్పై కూడా లక్ష రివార్డును ప్రకటించారు. వారితోపాటు బుటా సింగ్, సుఖ్దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ ఆచూకీ సమాచారం అందిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీప్ సిధుతోపాటు నేరుగా సంబంధమున్న వారంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తున్నారు. దీప్ సిధు బీహార్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎర్రకోట ఘటనకు సంబంధించి పోలీసులు 12 మంది ఫొటోలను విడుదల చేశారు.
Deep Sidhu : ఇంటర్నెట్ నిలిపివేతపై లాయర్ల నిరసన!
దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు పలు చర్యలు చేపట్టింది. ఈ చర్యలపై 140 మంది న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేకు బుధవారం లేఖ రాశారు.సింఘు, ఘాజీపూర్, టిక్రీ బోర్డర్లల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడంపై న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం అందరికీ ఇంటర్నెట్ చాలా అవసరమని.. ఈ సేవలపై ఆంక్షలు విధించడమంటే.. ప్రాథమిక హక్కులు, జీవించే హక్కును హరించడమేనని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. దీంతోపాటు సేవలు పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. జనవరి 26 హింసాత్మక ఘటనల అనంతరం ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ రైతు శిబిరాల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ టెలికం ఆపరేటర్లను ఈ నెల 30న ఆశించింది. మొదట ఆదివారం రాత్రి వరకు నెట్ సేవలపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ దానిని పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.