హైదరాబాద్ లో భారీ మొత్తంలో హవాలా నగదును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ మూసబ్ ట్యాంక్ పరిధిలోని షాయబ్ అనే వ్యక్తి వద్ద రూ.1.24 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన షాయబ్ మాలిక్ హైదరాబాద్ కు వచ్చి స్క్రాప్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయన బంధువు కామిల్ సూచన మేరకు హవాలా నగదు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
గుజరాత్ గల్లీకి చెందిన భరత్ వద్ద తీసుకున్న హవాలా డబ్బును షోయబ్ మాలిక్ తరలిస్తున్నాడని పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో షోయబ్ నివాసంకు వెళ్లి తనిఖీ చేశారు. అతని నివాసంలో ఉన్న రూ.1.24 కోట్ల నగదుకు సంబందింఛిన వివరాలను షోయబ్ పోలీసులకు తెలియజేయకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. భారీ మొత్తంలో పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఐటీ లేదా ఇడీ అధికారులు దీనిపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది.