కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ను పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుండటంతో ఆమె ఉక్కిరిబిక్కిరవుతున్నారని సమాచారం.ఈ కేసులో అఖిలప్రియకు కోర్టు బెయిల్ నిరాకరించగా పోలీసులు మూడు రోజుల కస్టడీకి తమ అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు కస్టడీలో భాగంగా అఖిల ప్రియను రెండోరోజు విచారిస్తున్నారు పోలీసులు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో అఖిల ప్రియ విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ కేసులో తన ప్రమేయం లేదని చెప్తున్నారు అఖిల ప్రియ.ఈ దశలో తమ వద్ద ఉన్న కాల్స్ లిస్టులు ముందుంచి ఆమెను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్స్, టవర్ లొకేషన్స్ ఆధారాలు చూపించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొదటి రోజు విచారణలో భర్త భార్గవ్ రామ్ ఆచూకీ కోసం ప్రశ్నించారు పోలీసులు. కిడ్నాప్ కు సహకరించిన నిందితుల వివరాలపై ఆరా తీశారు.బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురు అరెస్ట్ అయ్యారు. ప్రధాన సూత్రధారి అఖిలప్రియతో పాటు మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మరోవైపు కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన.. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. కిడ్నాప్ కేసులో మొత్తం 19 మంది ప్రమేయమున్నట్లు తేల్చారు పోలీసులు. భార్గవ రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారని….. కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు సెల్ ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాపర్లతో అఖిల ప్రియ టచ్ లో ఉన్నట్లు ఆధారాలు కూడా సేకరించారు పోలీసులు.ఆమె వాడిన సెల్ఫోన్ నెంబర్ ను కూడా పోలీసులు గుర్తించారు.పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించాకే అఖిలప్రియను పోలీసులు అన్ని వైపు నుండి బిగించి చేస్తున్నట్లు తాజా సమాచారం.అంతేగాకుండా ఆమె సోదరుడు జగద్విఖ్యాతరెడ్డి కారు డ్రైవర్ ను ఇదే కేసులో కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మరో వార్త వినవస్తోంది.అయితే దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.మొత్తంగా చూస్తే ఈ కేసులో అఖిలప్రియ బాగా లోతుగా కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.