ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు వరద ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులకు ఏడాదికి ఒక సారో రెండు మూడేళ్లకో వరదలు రావడం సహజంగా జరుగుతున్నదే. అదే మాదిరిగా ఈ ఏడాది వరదలు వచ్చాయి. వరదల కారణంగా నది పరివాహక గ్రామాలు ముంపునకు గురి కావడం, వరద సహాయక చర్యలు తెలుగు మీడియాలో ప్రాధాన్యంగా చూపిస్తూ ఉంటాయి. కానీ ఏడాది వరదల వార్తలకు తెలుగు మీడియా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయ ప్రాధాన్యత అంశాలలో వరదల వార్తలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా, మూడు రాజధానులు న్యాయమూర్తుల ఫోన్ టాపింగ్ అనే వంటి రాజకీయ ప్రాధాన్యత అంశాలు హాట్ టాపిక్ గా ఉండడంతో ఈ నదులవరదలు పెద్దగా మీడియాకు కనిపించడం లేదు.
గోదావరిలో ప్రస్తుత పరిస్థితి ఇది
గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 22,40,194 క్యూసెక్కులుగా ఉండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతితో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో తూర్పు గోదావరి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాల మధ్య రాకపోకలు స్థంబించాయి. విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అసలే ఒక పక్క కరోనాతో గ్రామాలు అల్లాడుతున్న సమయంలో ఈ వరద ముంపు ఊహించని ఉపద్రవంగా పరిణామించింది. ముఖ్యంగా విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూనవరం, విఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో రాకపోకలు స్తంభించాయి. దేవీపట్నం మండలంలోనే వేలాది ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. కోనసీమ లంక గ్రామాల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం.
కాజ్ వేలు మునిగిపోయి రహదారులు నీటమునిగాయి.
వరదలపై సమీక్ష
గోదావరి వరద పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ముంపు బాధితుల కుటుంబాల కు రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అధికారులకు జగన్ సూచించారు. ప్రజాప్రతినిధులు ఇస్తున్న క్షేత్ర స్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజు లలో పంట నష్టం అంచనాలు పంపించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోనూ వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమీక్ష జరిపి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.