Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తోంది. ఏపీలో కరోనాతోపాటు పది, ఇంటర్ పరీక్షల అంశం రాజకీయంగా హీటెక్కిస్తోంది. ప్రభుత్వం ఓపక్క, రాజకీయ పార్టీలు, వ్యవస్థలన్నీ ఓపక్క పరీక్షలపై తమ వాదనలు వినిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తనయుడు లోకేశ్ పది పరీక్షలను రద్దు చేయాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. నేడు క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా సీఎం జగన్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. విద్యార్ధుల భవిష్యత్తు నేపథ్యంలోనే కష్టమైనా, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లపై పాస్ అనేది విద్యార్ధుల భవిష్యత్తుకు మంచిది కాదని అన్నారు. ఈ నిర్ణయంపై టీడీపీ మండిపడుతోంది.
అయితే.. ఇదే నిర్ణయం చంద్రబాబు సీఎంగా ఉండి తీసుకుంటే.. ‘విద్యార్ధుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న దార్శినికుడు, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా అడుగేస్తున్న చంద్రబాబు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. రియల్ పరిపాలనాదక్షుడు’ అని టీడీపీ నేతలు బాకా ఊదేవారంటూ పొలిటికల్ కామెంట్స్ వస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలు.. గతేడాది సీఎం జగన్ కరోనాపై మాట్లాడుతూ ‘కరోనాతో కలిసి జీవించాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలను నాడు చంద్రబాబు విమర్శించారు. కానీ.. జగన్ చెప్పిన మాటనే ఎందరో నిపుణులు తర్వాత చెప్పారు కదా అనేది వారి మాట. పరీక్షల విషయంలో కూడా జగన్ ఆలోచనను విద్యార్ధులు, తల్లిదండ్రులు అర్ధం చేసుకుంటారనేది వారి వాదన.
ఈ అంశాన్ని రాజకీయంగా తీసుకుంటే ఎవరి వాదన వారిదే అవుతుంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పు ఇక్కడ ప్రస్తావనార్హం. రాజమండ్రి ఘాట్ లో తనపై దర్శకుడు బోయపాటి శ్రీనుతో డాక్యుమెంటరీ చిత్రీకరించే ఏర్పాటు చేశారు. కానీ.. ఆ ఆలోచన ఏకంగా 26 మంది అక్కడే తొక్కిసలాటలో మృతి చెందేలా చేసింది. అధికార దర్పంతో అత్యుత్సాహంతో చేసిన పని ఇది. ఇప్పుడు కూడా సీఎం హోదాలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఊహించలేని విపత్తుకు కారణం కాకూడదు. మరి.. విషయం కోర్టుల వరకూ వెళ్తోంది. ప్రస్తుతానికైతే జూన్ లో పరిక్షల నిర్వహణకు వెళ్తున్నారు. ఈలోపు సీఎం జగన్ నిర్ణయం మారుతుందా? కోర్టులే నిర్ణయిస్తాయో చూడాలి.