ఇంతవరకు ఎక్కడా కనీవినీ ఎరుగని వింత ఒకటి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా జరిగింది.ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏ పార్టీ చేసిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో అద్భుతమైన జిమ్మిక్ ఒకటి ప్రదర్శించింది.
సాధారణంగా ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ చేస్తారు అంటే ఓటర్ల కావాల్సినవి సమకూర్చడం అన్నమాట. ఇది ఎన్నికల ప్రచార సమయంలో జరుగుతుంది. కానీ దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రారంభం అయ్యాక సోషల్ మీడియా ద్వారా పోల్ మేనేజ్మెంట్ జరగడమే ఇక్కడ విశేషం.దుబ్బాకలో అధికార టీఆర్ఎస్కు బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ ఓట్లు చీలిస్తే గానీ గట్టెక్కలేమన అంచనాతో ఏ పార్టీయో కానీ భలే ఐడియా వేసింది.పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే అక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు అంటూ ప్రముఖ టీవీ చానెళ్లు టీవీ నైన్ ,టెన్ టీవీ ల లోగోలతో సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు వచ్చేశాయి.ఇది తెగ వైరల్ అయ్యాయి.
చెరకు శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో ఆయన మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినా ఎవరూ ఆశ్చర్యపోరన్న లెక్కతో ఈ తరహా ప్లాన్ అమలు చేశారు. ఎలాగూ పార్టీ మారే అభ్యర్థికి ఓటు వేయడం ఎందుకని ఓటర్లను గందరగోళానికి గురి చేయడమే ఈ ప్రచార లక్ష్యం. పైగా వార్తలు వస్తున్నవి బాగా ప్రజాదరణ పొందిన టీవీలోగోలతో కాబట్టి వాటిని ఓటర్లు నమ్మేసే అవకాశం కూడా ఏర్పడింది. ఈ విధంగా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ ఓట్లకు గండికొట్టగలిగారు.విషయం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి దృష్టికి వచ్చే సరికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
ఆయన వివరణ న్యూస్ ఛానెళ్లలో వచ్చేసరికి పోలింగ్ కూడా ముగిసిపోయింది.సరే…ఆ తరువాత కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి జరిగినప్పటికీ ఫలితం రాకముందే కాంగ్రెస్కు మూడోస్థానం దుబ్బాకలో రిజర్వ్ అయిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ ఫేక్ పోస్టు ప్రభావం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉందని వారు చెబుతున్నారు.అయితే ఈ వ్యవహారంలో అందరి వేళ్లు టీఆర్ఎస్ వైపే తిరుగుతున్నాయి.ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ పోస్టుల్లో కోట్ చేసిన రెండు టీవీ ఛానళ్లు కూడా టీఆర్ఎస్ కి అనుకూలమైనవే!ఇంకా ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!