అనంతపురం: అనంతపురం జిల్లాలో పోలింగ్ హింసాత్మకంగా మారింది. జిల్లాలో పలు ప్రదేశాల్లో టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగాయి. ఈ ఘర్షణల్లో టిడిపి చెందిన ఒక కార్యకర్త మృతి చెందాడు. వైసిపి, టిడిపిలకు చెందిన పలువురు గాయపడ్డారు.
తాడిపత్రి మండలం వీరాపురంలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘర్షణల్లో టిడిపి నేత సిద్దా భాస్కర్రెడ్డి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వైసిపికి చెందిన నేత పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం సిద్ధ రామాపురంలో పోలింగ్ కేంద్రంలోనే టిడిపి, వైసిపి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. అదే మండలం అనప గ్రామంలోనూ రెండు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు.