కరోనా దేశంలో అన్ని రాష్ట్రాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా నేటి వరకు 13 లక్షల 85 వేల కేసులు నమోదు కాగా 32 వేల మంది మరణించారు. 8 లక్షల 85 వేల మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. కాగా పుదుచ్చేరిలో, 2,654 కేసులు నమోదు కాగా 38 మంది మృతి చెందారు. 1561మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీ లు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
ఈ క్రమంలో పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఒక ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లందరూ వారం రోజుల పాటు హోమ్ ఐసొలేషన్లో ఉండాలని సీ ఎం వి నారాయణ స్వామి సూచించారు. ఎమ్మెల్యే లందరికీ సోమవారం కరోనా టెస్ట్ లు నిర్వహిస్తామని సీ ఎం నారాయణ స్వామి అయన తెలిపారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుద్దుచ్చేరిలో సోమవారం నుంచి శనివారం వరకు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కరోనా నేపథ్యంలో సమావేశాల చివరి రోజు శనివారం అసెంబ్లీ సమావేశాలను ఆరు బయట నిర్వహించారు. బడ్జెట్పై చర్చ అనంతరం అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. మరో వైపు కరోనా నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంపై స్పీకర్ శివకొలుందును లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అభినందించారు.