మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ రోజు ప్రకటించారు. అయితే గద్దర్ ఏ పాార్టీ నుండి పోటీ చేయనున్నారు అనేది తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఎందుకంటే.. విప్లవ భావాలు కల్గిన ప్రజా గాయకుడు గద్దర్ .. తన పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని జాగృతం చేశారు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం లో సైతం ఆయన పాటలు ఎంతో మందిలో స్పూర్తిని నింపాయి. గతంలో ఎప్పుడూ ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. అయితే ఆయన ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లుగా ఇటీవల పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. గత ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన మోడీ బహిరంగ సభకు హజరై అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆ తర్వాత ఓ సారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు వెళ్లారు. ఈ పరిణామాలతో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారేమో అన్న ఊహాగానాలు వచ్చాయి.
అయితే మునుగోడు ఉప ఎన్నికల వేళ గద్దర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ (పీఎస్పీ) కండువా కప్పుకున్నారు. ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని శాంతి ర్యాలీ నిర్వహణకు కేసిఆర్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కేఏ పాల్ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. గద్దర్ ఈ రోజు కేఏ పాల్ ను కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. పిఎస్పీ తీర్ధం పుచ్చుకున్న గద్దర్ .. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం నుండి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం శ్రమిస్తున్న కేఏ పాల్ తో కలిసి పని చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గద్దర్ తెలిపారు. గద్దర్ ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్నారని ప్రకటించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.