పోర్న్ లింక్ వ్యవహారం ఎస్వీబీసీ ఉద్యోగుల మెడకు చుట్టుకుంది. ఓ భక్తుడికి అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఘటనపై టీటీడీ ఐదుగురు ఉద్యోగులను తొలగించింది.. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది..
ఈ ఘటన వెలుగు చూసిన మొదటిరోజే ఒకర్ని విధుల నుంచి తొలగించిన అధికారులు.. ఆ తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు.. టీటీడీ ఈవోకు నివేదిక ఇచ్చారు.. ఈ నివేదిక ఆధారంగా వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ప్రకాశ్, రామ్మూర్తి, రాదేష్, మోహన్రావు, వీరబాబుపై వేటు పడినట్లుగా తెలుస్తోంది.. మరో నలుగురు సీనియర్ ఉద్యోగులు శ్రీనివాస్, కృష్ణారావు, సోమశేఖర్, మురళీకృష్ణకు షోకాజు నోటీసులు ఇచ్చారు. పుట్టినరోజునాడు వేదమంత్రాలతో ఆశీర్వదించే ఉద్దేశంతో శతమానంభవతి కార్యక్రమం రూపొందించింది ఎస్వీబీసీ. ఆ ప్రోగ్రామ్ కోసం ఓ భక్తుడు మెయిల్ చేశాడు. థ్యాంక్యూ అనో, మెయిల్ అందిందనో రిప్లై ఇవ్వాల్సిన సిబ్బంది.. తాము చూస్తున్న పోర్న్ వీడియోల లింక్ పంపించారు. ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్, ఈవోకి ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్.. ఎస్వీబీసీ ఆఫీసులోనే నీలి చిత్రాలు చూస్తున్న పలువురు ఉద్యోగులను గుర్తించింది. పోర్న్ వీడియో లింక్ పంపిన ఉద్యోగిని టీటీడీ ఇప్పటికే తొలగించగా.. తాజాగా మరికొందరిపై వేటు పడింది. మరో నాలుగైదు రోజుల్లో మరికొంతమందికి కూడా షోకాజు నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారంతో ఎస్వీబీసీ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఎస్వీబీసీ ఇలాంటి వివాదాలకు కేంద్రంగా మారింది.ఈ సంస్థ చైర్మన్గా ఉన్న సినీ నటుడు పృథ్వీ ఎస్వీబీసీ ఉద్యోగిని ఒకరితో ఫోన్లో అసభ్యంగా మాట్లాడినఆడియో టేపు బయటకు రాగా ఆయన అనివార్య పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం తెలిసిందే.ఈ సందర్బంగా పృథ్వీ ఎస్వీబీసీలో చాలా రాజకీయాలు ఉంటాయని,దానికి తాను బలయ్యానని అనేక మీడియా ఇంటర్వ్యూల్లో మొత్తుకున్నారు. ఏదేమైనప్పటికీ టీటీడీ అనుబంధ సంస్థగా ఉన్న ఎస్వీబీసీలో ఇలాంటి అశ్లీల అసభ్య కార్యకలాపాలు జరుగుతుండటం,అవి వెలుగులోకి రావడం భక్తుల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయి.