తాను ఏమి మాట్లాడినా సంచలనమే అన్నస్థాయి కామెంట్లకు రచయిత – నటుడు – వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు దారు పోసాని కృష్ణమురళి సరిగ్గా సరిపోతారనే చెప్పాలి. జగన్ కు మద్దతుతెలిపే విషయంలో, చంద్రబాబును విమర్శించే విషయంలో పోసాని దూకుడే వేరు! రాజకీయ ప్రత్యర్ధులు సైతం బాబును.. పోసాని రేంజ్లో విమర్శించరన్నా అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు పోసాని.
ఇటీవలి జరిగిన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు అండ్ కో మాట్లాడుతూ… ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేయగా.. బాలకృష్ణ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండదని.. మధ్యలోనే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని టీడీపీపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అక్కడున్నది ఎన్టీఆర్ కాదని.. జగన్ అని పోసాని అన్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మొదలుపెట్టిన పోసాని.. “ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదు పొడిపించుకోవడానికి.. అక్కడున్నది జగన్. ఆయన పొడవడు. పొడిపించుకోడు’” అని పంచ్ డైలాగ్ పేల్చారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేసి వాళ్ల రైతుల కష్టాలు తెలుసుకుని వారికి మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పిన పోసాని… ఏపీలో ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తుందని సూచించారు.
ఇదే క్రమంలో ఏపీ – తెలంగాణ మధ్య నడుస్తున్న నీటి వివాదంపై కూడా పోసాని స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యా మంచి స్నేహం ఉందని అభిప్రాయపడిన పోసాని… కేసీఆర్ చెబితే జగన్ వింటారని – అలాగే జగన్ రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ ఆలోచిస్తారని.. వాళ్లిద్దరూ కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారని ఆశిస్తున్నానని తెలిపారు! ఏది ఏమైనా… జగన్ కు కూడా చంద్రబాబు వెన్నుపోటు ప్లాన్ చేస్తున్నారని పోసానికి ఏమైనా క్లూ అందిందా… “ఎన్టీఆర్ కాదు పొడిపించుకోవడానికి.. అక్కడున్నది జగన్” అంటూ పంచ్ వేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు!