ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో ప్రత్యేక పర్యవేక్షణలో పనులు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్ట్ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం 55 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో గేట్ల ఏర్పాటు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ) సీఇఓ కే చంద్రశేఖర్ అయ్యంగార్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆదివారం ప్రాజెక్టును సందర్శించి పనులు పరిశీలించింది. స్పిల్ వే బ్రిడ్జి, గేట్ల ఏర్పాటు, ఎగువ కాపర్ డ్యామ్ పనులను, ఫిష్ లాడర్ పనులను పరిశీలించారు. రేపు సాయంత్రానికి ప్రాజెక్టులో తొలి గేటు అమరుస్తామని సీఇఓ అయ్యంగార్ కు ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా సీఇఓ చంద్రశేఖర్ అయ్యర్ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. పనులు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయన్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసీన సీఇఓ అయ్యంగార్ సోమ, మంగళవారాల్లో తూర్పుగోదావరి జిల్లా అంగలూరు వైపున ఎడమ ప్రధాన కాల్వ కనెక్టవిటీ పనులను, ఆర్ అండ్ కాలనీలను పరిశీలించి ఇంజనీర్లతో సమీక్ష నిర్వహిస్తారు. భూసేకరణ నిధులపై అయ్యంగార్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. పర్యటనలో చివరి రోజైన బుధవారం కూడా ఎడమ కాలువ పనులను పరిశీలించిన అనంతరం హైదరాబాద్ తిరిగి వెళతారు. హైదరాబాద్ వెళ్లిన తరువాత అయ్యంగార్ తన పర్యటన వివరాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదిక రూపంలో అందించనున్నారు.