ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఆ వుడ్.. ఈ వుడ్ అని కాకుండా అన్ని వుడ్ లలో ఇదే చర్చ. ప్రభాస్ అంటేనే టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లోనూ క్రేజ్. అందులోనూ ప్రభాస్ డైరెక్ట్ గా తొలిసారి బాలీవుడ్ మూవీ చేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే.. తెలుగులోనూ చాలామంది హీరోలు బాలీవుడ్ లో తమ లక్ చెక్ చేసుకున్నారు. కానీ.. పెద్ద పెద్ద హీరోలు కూడా బాలీవుడ్ లో చతికిలపడ్డారు.
అయితే.. ప్రభాస్ ఇమేజ్ వేరు. ఆయనది పాన్ ఇండియా ఇమేజ్. బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. అందుకే… డైరెక్ట్ గా బాలీవుడ్ లోనే సినిమాను అనౌన్స్ చేశాడు.
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ అవుతున్నాయి. సాహో కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. ఆ తర్వాత వస్తున్న రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోయే సినిమా మాత్రం ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో రాబోతోంది.
ఓవైపు ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో సినిమా స్థాయిలోకి వెళ్తుండటం, డైరెక్ట్ గా బాలీవుడ్ లో సినిమా తీస్తుండటం ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషంగా ఉన్నప్పటికీ.. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఆది పురుష్ సినిమా విషయంలో మాత్రం అంత హ్యాపీగా లేరు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆది పురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్. ఆయన దర్శకత్వంలో అనేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎక్కడో కొడుతోంది. ఎందుకంటే… ఓం రౌత్.. తానాజీ సినిమా సరిగ్గా తీయలేదనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తానాజీ సినిమానే సరిగ్గా తెరకెక్కించలేకపోయాడు.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ తో ఆది పురుష్ ను ఓం రౌత్ ఎలా తెరకెక్కిస్తాడో అని ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
మరోవైపు టాలీవుడ్ స్టార్లు ఎవ్వరూ ఇప్పటి వరకు బాలీవుడ్ లో నిలదొక్కుకోలేదు. మరి.. ప్రభాస్ అయినా నిలదొక్కుకుంటాడా? లేదా? అన్న టెన్షన్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉందట.
ఏది ఏమైనా.. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్. ఒక అడుగైతే ముందుకు వేశాడు. చూద్దాం.. ఆది పురుష్ డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి… 3డీ ఫార్మెట్ లో వస్తున్న విజువల్ వండర్ కాబట్టి.. ఆది పురుష్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలను సృష్టిస్తుందనే ఆశిద్దాం..