Prabhas, NTR: సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ‘రౌడీ బాయ్స్(Rowdy Boys)’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హీరోగా ఆశిష్ రెడ్డి, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వన్ నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తోడబుట్టిన శిరీష్ రెడ్డి కుమారుడే ఈ ఆశిష్ రెడ్డి (Ashish Reddy). ఈ సినిమాతో ఆశిష్ హీరోగా సినీ ప్రేక్షకులకు సుపరిచితం అవుతున్నాడు. అయితే ఇంకో వారంలో సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్లు జోరుగా సాగడం లేదు. కరోనా కారణంగా ప్రమోషన్లు చేయడానికి చిత్రబృందం కూడా దూకుడుగా వ్యవహరించ లేకపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రంగంలోకి దిగారు. ప్రచారాలకు బయట పరిస్థితులు అనుకూలంగా లేవని ఆయన ఒక వినూత్న ఆలోచన చేశారు.
Prabhas, NTR: ప్రభాస్, ఎన్టీఆర్ చేతులు కలిపితే మాములుగా ఉండదు
తెలుగు ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీ ఉన్న ప్రభాస్, ఎన్టీఆర్ ద్వారా రౌడీ బాయ్స్ సినిమాని డిజిటల్ గా ప్రమోట్ చేయించాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు. దిల్ రాజు అడగ్గానే ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరూ సినిమాని ప్రచారం చేసేందుకు అంగీకరించారు. జూ.ఎన్టీఆర్ ఈరోజు అంటే జనవరి 8 శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు రౌడీబాయ్ ట్రైలర్ను (Rowdy Boy Trailer) ఆవిష్కరించనున్నారు. మరోవైపు ప్రభాస్ ఆకట్టుకునే విధంగా రౌడీ బాయ్స్ గురించి ఒక ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ చేతులు కలిపితే చాలు.. సినిమా క్రేజ్ మామూలుగా పెరిగిపోదని.. వేరే లెవెల్ లో సినిమా అందరికీ రీచ్ అవుతుందని దిల్ రాజు బలంగా విశ్వసించారు. అందుకే ఆయన ప్రమోషన్లన్నీ మానేసి వీరిద్దరి పైనే ఆధారపడుతున్నారు. అలాగే మరికొందరు హీరోల ద్వారా ఆన్లైన్ ప్రమోషన్ చేయించే యోచనలో ఉన్నారు దిల్ రాజు.
ఇదొక యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్
డైరెక్టర్ శ్రీ హర్ష కోరుగంటి (Sree Harsha Koruganti) రూపొందించిన రౌడీ బాయ్స్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఇందులోని పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయని చిత్రబృందం విశ్వసిస్తోంది. దిల్ రాజు తో పాటు ఈ సినిమాని సోదరుడు శిరీష్ కూడా నిర్మించారు. ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాని సుమిత్ అనిత ప్రెజెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్లాన్ చేయలేదు. అయితే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు వాయిదా పడటంతో రౌడీ బాయ్స్ చిత్రాన్ని సంక్రాంతి ట్రీట్ గా రిలీజ్ చేస్తోంది చిత్ర బృందం సిద్ధమైంది.