District Education Officer: ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావుకు కోర్టు ధిక్కరణ నేరం కింద పధ్నాలుగు రోజులు జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.అంతేగాక వేయి రూపాయల జరిమానా విధించింది. అది కట్టకపోతే మరో నాలుగు రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
నేపథ్యం ఏమిటంటే!
రిటైర్ అయిన ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ కు రావాల్సిన ఆర్థికపరమైన ప్రయోజనాలను నిలిపి వేయగా అతను హైకోర్టును ఆశ్రయించాడు.ఈ కేసులో అతడికి అన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలు చెల్లించాల్సిందిగా 2019 వ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండో తేదీన హైకోర్టు డీఈవోను ఆదేశించింది.ఈ ఆర్డర్ అందిన రెండు వారాల్లోపు చెల్లింపులు జరపాలని స్పష్టం చేసింది.హైకోర్టు ఆర్డర్ ప్రకాశం జిల్లా డీఈఓకి 2019 వ సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై నాలుగో తేదీన చేరింది .కానీ సదరు టీచర్ కు ఈ ఏడాది జనవరి ఆరో తేదీన చెల్లింపులు జరిగినట్లు హైకోర్టుకు సమాచారం అందింది.హైకోర్టు ఆదేశాలను పధ్నాలుగు నెలల పాటు డీఈవో అమలు చేయకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.దీన్ని కోర్టు ధిక్కరణ నేరంగా నిర్ణయించింది. కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినందుకు గాను ఆయనకు జైలు శిక్ష విధించారు.
హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.కోర్టు ఆదేశాలను సకాలంలో పాటించనందుకు డీఈఓ క్షమాపణ కోరారని, కానీ ఆయన ఇందుకు అర్హుడు కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.ఈ సందర్బంగా ముల్క్రాజ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసులో అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన చదివి వినిపించారు.శిక్ష నుండి తప్పించుకోవటానికి అధికారులు చెప్పే క్షమాపణలను పరిగణనలోకి తీసుకుంటే వారు మళ్లీ మళ్లీ ఇవే పనులు చేస్తారని,ఇందువల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుందని ఆ తీర్పులో పేర్కొన్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు తీర్పును అమలు చేయకపోవడం శిక్షార్హమైన నేరమని కూడా ఆయన అన్నారు.కోర్టు ఆదేశాలను డీఈవో తుంగలోతొక్కి పధ్నాలుగు నెలలు చెల్లింపులు చేయకపోవటం వల్ల పిటిషనర్ కుటుంబం అనేక ఇబ్బందులకు గురైందని అమానవీయ చర్య అని కూడా న్యాయమూర్తి తెలిపారు.
అన్ని విధాలా డీఈఓ శిక్షార్హుడు!
ఈ నేపధ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి శిక్షార్హుడని స్పష్టం చేసిన న్యాయమూర్తి ఆయనకు జైలు శిక్ష విధించారు. హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ మంగళవారం తీర్పివ్వగా గురువారం నాడు తీర్పు డీఈవోకు చేరింది.అయితే డీఈఓ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఈ తీర్పు అమలును వారం రోజుల పాటు వాయిదా వేశారు.జిల్లాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?