ఖాకి సినిమా చూసారా ..? దానిలో కారుడు గట్టిన నేరస్తుల్ని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ హీరోతో పాటు అతని టీమ్ అంత పలు రాష్ట్రాలు వెళ్తారు. రాజస్థాన్ లో ఓ గ్రామంలో తమకు కావాల్సిన దొంగలు ఉన్నట్లు తెలుసుకుని హీరో, అతని బృందం మొండిగా గ్రామంలోకి ఎంటర్ అవుతారు… అక్కడ గ్రామస్థులు అంత ఏకమై పోలీసులను తరిమి తరిమి కొడతారు…. అచ్చు ఎలాంటి సంఘటనే ప్రకాశం పోలీసులు ఎదుర్కొన్నారు… చావు అంచుల వరకు వెళ్లొచ్చి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
గత కొంత కాలంగా ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా రాష్ట్రంలోని బాగా పేరున్న వ్యక్తుల పేరు మీద నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లను సృష్టించి అత్యవసరం అంటూ చిన్న మొత్తం లో తన ఫ్రెండ్స్ అందరి వద్ద డబ్బులు కాజేస్తున్న విషయంలో ప్రకాశం ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పేరును నకిలీ కేటుగాళ్లు వాడారు. అయన పేరు మీద అకౌంట్ సృష్టించి ఏకంగా అయన స్నేహితుల వద్ద నుంచి సుమారు 20 వేల వరకు కొల్లగొట్టారు. విషయం ఎస్పీకు తెలిసి దీనిపై వెంటనే కేసు నమోదు చేయించారు. అయితే రాష్ట్రంలో చాలామంది అకౌంట్లు ఇదే తీరుగ నకిలీ కేటుగాళ్లు సృష్టించడంతో ఈ కేసును ప్రకాశం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
బయటపడిన రాజస్థాన్ మూలాలు
కేసు మీద ప్రధానంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో బృందం పనిచేసింది. సాంకేతికంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కేటుగాళ్లు ఇక్కడి నుంచి మెసెంజర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేది తెలుసుకునేందుకు పోలీసులకు నెల సమయం పట్టింది. దీనికి ఫేస్ బుక్ ఇండియా సహాయం తీసుకున్నారు. చివరకు మెసెంజర్ ఫోన్ ఐడీలు రాజస్థాన్ చూపించాయి. దింతో రాజస్థాన్ వెళ్లి రహస్య ఆపరేషన్ మొదలు పెట్టారు
* భారత్ పుర జిల్లా, కుందన్ నాగ్ల గ్రామం లోని వారే నిందితులుగా ప్రాధమికంగా గుర్తించిన ఏపీ పోలీసులు రెండు రోజుల పూర్తి రెక్కీ తర్వాత నిందితులు ఎక్కడున్నారో, వారి స్థావరం ఎక్కడుందో అవగాహనకు వచ్చి దాడి చేసేందుకు సమాయత్తమయ్యారు. నిందితుడి ఏంటికి వెళ్లి అతన్ని బయటకు తెచ్చేలా ఓ ప్రణాళిక వేశారు.
* శనివారం రాత్రి ఇద్దరు ఎస్ఐలు, 6 మంది కానిస్టేబుళ్లు గ్రామంలోనే ఒక ప్రదేశంలో నిద్రించి అర్ధరాత్రి 3 గంటల సమయంలో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఇంటికి వెళ్లారు. దీనితో బయటకు వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులు వేష, బాషా చూసి వారితో గొడవ పడ్డారు. అది పెద్దది అయ్యి గ్రామమంతా ఏకమై పోలీసులపై దాడికి తెగబడ్డారు. నిమిషాల్లో ఎం జరుగుతుందో తెలుసుకునే లోపే గ్రామంలోని వారంతా తమకు తోచిన విధంగా పోలీసులపై దాడి చేయడంతో ఏమి చేయలేని పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. అర్ధరాత్రి వేళ వచ్చిన వారు దోపిడీ దొంగలుగా భావించామని స్థానిక పోలీసులకు గ్రామస్తులు చెప్పడం విశేషం.
* స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లడం వల్లనే ఈ దాడి జరిగి ఉంటుందని సీనియర్ పొలిసు అధికారులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినపుడు కచ్చితంగా స్థానిక పోలీసులకు విషయం చెప్పాలని, వారిని వెంట తీసుకువెళ్తేనే మంచిదని చెబుతున్నారు. ఇది జరగకపోవడంతోనే దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో గ్రామస్తులు కావాలనే ఇలా దాడులు చేసి, నిందితుల్ని తప్పిస్తారని కూడా సదరు అధికారి హెచ్చరిస్తున్నారు.
* దీనిపై ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ద్రుష్టి పెట్టినట్లు తెలిసింది. ఘటనపై అయన అన్ని వివరాలు కనుక్కోవడమే కాదు.. అక్కడి పోలీసులతో మాట్లాడి నిందితులను పట్టుకునేందుకు సహకరించాలని కోరడంతో ఈ కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.