BJP: తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సుపరిపాలన అందించడంలో విఫలమైయ్యాయని ఆరోపించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్..ఏపిలో ఆ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటేనని పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన బీజేపీ ప్రజాగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా మంది నేతలు బెయిల్ పై ఉన్నారనీ, వాళ్లు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చూశారనీ, ప్రజలకు అవి ద్రోహం చేశాయన్నారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమని జవదేకర్ పేర్కొన్నారు.
BJP: మద్యం ఆదాయంతో పాలన
తెలంగాణలో టీఆర్ఎస్ గానీ, ఏపీలో వైసీపీ, టీడీపీ మూడు కుటుంబ పాలన పార్టీలేనన్నారు. ఏపిలో విధ్వంసకర పాలన సాగుతోందని విమర్శించారు. మద్య నిషేదం అని అధికారంలోకి వచ్చి మద్యంపై వచ్చిన ఆదాయంతో పాలన సాగిస్తున్నారని అన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిర్మించింది జగనన్న కాలనీలు కాదనీ, మోడీ కాలనీలు అని పేర్కొన్నారు. తన హయాంలోనే పోలవరంకు అనుమతులు ఇచ్చి ఏడేళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు. అమరావతి కోసం అటవీ భూములను బదిలీ చేశామని పేర్కొన్న ఆయన రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ పడుతున్నాయని జవదేకర్ విమర్శించారు.
2024 లో అధికారం ఖాయం
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో జరుగుతోందనీ, కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ 2022 చివర్లో కానీ 2023 మొదట్లో గానీ వైసీపీ పాలన పోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో బండి ఎలా పరుగెడుతుందో అలాగే ఏపిలో కూడా వీర్రాజు బండి కదలాలని అన్నారు. 2022 జనవరి తర్వాత ఏపీ బీజేపీ వేసే ప్రతి అడుగుతో 2024 లో అధికారంలోకి వస్తుందని పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యానించారు. టీడీపీని ఏపి ప్రజలు పక్కన పెట్టేశారనీ, వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లతో మళ్లీ అధికారం చేపడుతుందన్నారు. సభలో రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నర్శింహరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి, మాజీ మంత్రులు ఆదినారాయణ, రావెల కిషోర్ బాబు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ప్రసంగించారు.