ప్రస్తుతం భారత దేశం మొత్తాన్ని కబళించి వేసిన కరోనా వైరస్ వల్ల ఎక్కడ ప్రాణాలు పోతాయోనని అందరూ బిక్కుబిక్కుమంటూ బ్రతికుతుంటే… కొంతమంది మాత్రం చావును వెతికి మరీ కొనితెచ్చుకుంటున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఈ మాయదారి మద్యం ఇప్పుడు అన్యాయంగా పన్నెండు మందిని పొట్టన పెట్టుకుంది. సమాచార లోపం వల్ల, మద్యం దొరకక… అందుబాటులో ఉన్న శానిటైజర్ ను తాగి ప్రకాశం జిల్లాకు చెందిన 12 మంది చనిపోవడం గమనార్హం.
అదే జిల్లాలో అందరూ…
ప్రకాశం జిల్లా పామూరు లో ముగ్గురు మద్యానికి బానిసై చివరికి మందు దొరకక శానిటైజర్ ను వారు తాగి మృతి చెందారు. వారిలో ఒక ఆడ మనిషి కూడా ఉంది. ఖాదర్ బి అనే ఒక మహిళ, రోశయ్య మరియు మల్లికార్జునలను చనిపోయిన వారిగా గుర్తించారు. ఇదిలా ఉండగా… కురిచేడు మండలం లో కూడా తొమ్మిది మంది శానిటైజర్ తాగి చనిపోయినట్లు బయటపడింది. కురిచేడు లో గురువారం రాత్రి శానిటైజర్ తాగినవారిలో రాత్రికి రాత్రే ముగ్గురు మరణించగా ఈరోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందడంతో మొత్తం ఈ రెండు ప్రాంతాల్లో కలిపి ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగడం వల్ల 12 మంది మరణించినట్లు అయింది.
పోలీసుల కహానీ వినండి…
కురిచేడు లో దాదాపు 12 మంది ఇలా శానిటైజర్ పుచ్చుకోవడంతో మరణాలు సంభవించాయి. వారిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడంతో మిగతా వారికి కూడా వైద్య పరీక్షలు చేయగా వారి ఒంట్లో కూడా శానిటైజర్ కెమికల్ ఉన్నట్లు వైద్యులు కనుక్కున్నారు. అయితే పామూరు లో మాత్రం పోలీసులు శానిటైజర్ తాగి ఆ ముగ్గురూ చనిపోలేదని… సహజంగానే వారి మరణం సంభవించిందని అంటున్నారు. కానీ స్థానికులు మాత్రం ఖచ్చితంగా వారు శానిటైజర్ సేవించారని…. తాము చూశామని చెబుతూ ఉండగా… ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇక పోలీసులు నిజాలను ఇలా ఎందుకు ఖండిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
స్పందించిన ప్రముఖులు..!
ఇక ఈ దుర్ఘటనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సహా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. అపోహలకు పోయి ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవద్దని వారు హితవు పలికారు. ఇక ఈ సంఘటన చాలా దురదృష్టకరమని… మరియు మద్యం బానిసలు తమ మానసిక పరిస్థితిని అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని సూచించారు.
ఏదేమైనా ఈ రెండు ఘటనలతో ప్రకాశం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రభుత్వం కూడా ఈ విషయమై మద్యం షాపుల్లో దొరికే మద్యం వేరు…. శానిటైజర్ లో ఉండే ఆల్కహాల్ వేరు అని ప్రజలకు తెలియజెప్పేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.