Prasanth Kishore Meet Sonia: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ ముఖ్యనేతలతో అధినేత్రి సోనియా గాంధీ శనివారం జరిపిన కీలక భేటీలో పీకే పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, రెండేళ్ల తరువాత సార్వత్రిక ఎన్నికల్లో పటిష్టమైన వ్యూహరచన కోసం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చితన్ శిబిర్ లేదా చింతన్ భైఠక్ పై చర్చించిన ఈ సమావేశంలోనే పీకే చేరికపైనా సోనియా గాంధీ నేతలతో మాట్లాడినట్లు సమాచారం.
Prasanth Kishore Meet Sonia: కాంగ్రెస్ కీలక నేతల భేటీలో పీకే
తన రాజకీయ భవిష్యత్తుపై మే 2వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్ నేడు కాంగ్రెస్ నేతల కీలక భేటీలో పాల్గొని చర్చించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తొంది. ఈ సమావేశంలో పార్టీ ఉన్నత స్థాయి నేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కేసి వేణుగోపాల్ పాల్గొన్నారు. తొలుత వీరంతా ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై చర్చించినట్లు తెలుస్తొంది. అనంతరం సమావేశానికి వచ్చిన ప్రశాంత్ కిషోష్ రాబోయే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలపై తన అభిప్రాయాలను వివరించినట్లు తెలుస్తొంది.
వారం లో క్లారిటీ
సమావేశం అనంతరం పార్టీ నేత కేసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ..2024 ఎన్నికల స్ట్రాటజీపై ప్రశాంత్ కిషోర్ ఓ డిటైల్డ్ రిపోర్టు అందజేశారనీ, దానిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వారం లోపు పార్టీ కీలక నేతలతో చర్చిస్తారని వేణుగోపాల్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ వ్యూహకర్తగా పని చేస్తారా..? లేక పార్టీలో చేరనున్నారా..? అనే ప్రశ్నపై వారం రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పీకే కలిసినట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరి సమావేశం గురించి అధికారికంగా ప్రకటించలేదు. తాజా సమావేశం నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై ప్రచారం మరో సారి ఊపందుకుంది.
గతంలో ప్రశాంత్ కిషోర్ పంజాబ్ ఎన్నికలకు వ్యూహకర్తగా పని చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 117 స్థానాలకు గాను 77 స్థానాలను కైవశం చేసుకుంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో పీకే కు ఎన్నికలకు మంచి వ్యూహకర్తగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఏపి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి తన ఎన్నికల వ్యూహాలకు తిరుగులేదు అన్నట్లుగా గుర్తింపు సాధించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ (ఎన్డీఏ) అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో పీకే ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమైయ్యారని ప్రచారం జరుగుతోంది.