బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ వృద్ధాప్యం కారణంగా అర్ధం కానీ, అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని పీకే వ్యాఖ్యానించారు. బీజేపీ అజెండాతో పీకే పని చేస్తున్నాడని నితీష్ కుమార్ వ్యాఖ్యలు చేయడంతో పీకే ఈ రోజు స్పందించారు. బీహార్ లో రాజకీయ పార్టీ స్థాపన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పేరుతో బీహార్ లో 3500 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవల సీఎం నితీష్ కుమార్ నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత తనను నితీష్ కుమార్ తనను ఇంటికి ఆహ్వానించారనీ, జేజీయూలో చేరి పార్టీని నడిపించాలని ఆఫర్ చేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అంతే కాకుండా నితీష్ కుమార్ నన్ను రాజకీయ వారసుడుగా చేసినా, సీఎం పదవి ఖాళీ చేసి ఇచ్చినా ఆయనతో కలిసి పని చేయనని తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు నితీష్ కుమార్. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ను తాను ఆహ్వానించలేదని, తానే స్వయంగా కలవడానికి వచ్చారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఏది కావాలంటే అది మాట్లాడనివ్వండి ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు నితీష్ కుమార్. నాలుగైదేళ్ల క్రితమే జేడీయును కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారనీ, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఎజెండా ప్రకారం పని చేస్తున్నారని విమర్శించారు నితీష్ కుమార్. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై నేడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. నితీష్ కుమార్ చెప్పేవన్నీ అసత్యాలేనని అన్నారు. నితీష్ కుమార్ ఏదో చెప్పాలని అనుకుంటారు కానీ వయస్సు ప్రభావంతో ఏదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిని ఇంగ్లీషులో బీయింగ్ డిల్యూషనల్ అంటారని పీకే పేర్కొన్నారు. తాను జేడీయును కాంగ్రెస్ లో విలీనం చేయమన్నానని చెబుతూనే బీజేపీ ఎజెండాతో ప్రకారం పని చేస్తున్నానని నీతీష్ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. మొదటిది నిజమైతే రెండోది తప్పు అవుతుందన్నారు. రాజకీయంగా తాను ఒంటరి అవుతున్నానన్న ఆందోళనలో నితీష్ కుమార్ ఉన్నారని పీకే వ్యాఖ్యానించారు.
ప్రశాంత్ కిషోర్ గతంలో జేడీయూ జాతీయ అధ్యక్షుడుగా పని చేశారు ఆ తర్వాత నితీష్ కుమార్ తో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీ నుండి పీకేని బహిష్కరించారు. ఆ క్రమంలోనే వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు ప్రశాంత్ కిషోర్. గత కొద్ది నెలల క్రితం బీజేపీకి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నింటినీ జాతీయ పార్టీ కాంగ్రెస్ గొడుకు కిందకు తీసుకువచ్చి యూపీఏని బలోపేతం చేయాలని భావించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కలిసి పని చేసేందుకు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కీలక భేటీలోనూ ప్రశాంత్ కిషోర్ పాల్గొని రాబోయే ఎన్నికల్లో అదికారంలోకి రావాలంటే ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై ఓ నివేదిక కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే పీకే కండీషన్ల కు కాంగ్రెస్ అంగీకరించకనో మరే కారణం చేతనో పీకే ఆ ప్రతిపాదన విరమించుకుని బీహార్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్.