ఢిల్లీ: లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వివి ప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఒకవేళ వీటి లెక్కింపును పెంచితే గనుక మొత్తం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి కనీసం ఆరు రోజులు పడుతుందని ఈసి పేర్కొంది.
ప్రతి నియోజకవర్గం పరిధిలో కనీసం 50 శాతం వివి ప్యాట్లను లెక్కించేలా ఈసికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా దాదాపు 21 పార్టీల నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 25 వ తేదీన విచారణ చేపట్టిన న్యాయస్థానం వివిప్యాట్ స్లిప్పులను లెక్కించడంలో ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేసు విచారణను ఏప్రిల్ 1 వ తేదీకి వాయిదా వేసింది.
దీంతో నేడు ఈసి తమ స్పందన తెలియజేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న విధానం సరైందేనని, రానున్న ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని ఈసి వెల్లడించింది. 50 శాతం స్లిప్లను లెక్కించాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో పేర్కొంది.
ప్రస్తుతం ఒక అసెంబ్లీ స్థానంలో ఒక్క వివి ప్యాట్ను మాత్రమే ఎంచుకుని దానిలోని ఓటరు స్లిప్పులను లెక్కిస్తున్నారు. దీనివల్ల ఆ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కేవలం 0.44 శాతం ఓటరు స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారు. ఇంత తక్కువ మొత్తంలో స్లిప్పులు లెక్కిస్తే కచ్చితత్వం తెలియదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.