Neeraj Chopra: ఒలంపిక్స్ లో అసమాన ప్రతిభ కనబర్చి జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 121 సంవత్సరాల భారతదేశ చరిత్రలో అథ్లెటిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారుడుగా నీరజ్ చోప్రా రికార్డులకు ఎక్కారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు కురిపించారు. మరో పక్క ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయకుడు, బీజేపీ, జనసేన అధ్యక్షులు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాకు ప్రశంసల జల్లు కురిపించారు.
నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించడం దేశానికి గర్వకారణమని, దేశ ప్రజల హృదయాల్లో ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఇది అసాధారాణ విజయమని అభినందించారు. నీరజ్ చోప్రా ఈ రోజు సాధించిన విజయం కలకాలం నిలిచిపోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. టోక్యోలో చరిత్ర సృష్టించారు, నీరజ్ చోప్రా సాధించిన విజయం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. యువ నీరజ్ ఎంతో పట్టుదలగా, అనితర సాధ్యమైన ప్రతిభను చూపారు. బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ కు నా అభినందనలు అంటూ ప్రధాని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు.
స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, రెజ్లింగ్ విభాగంలో కాంస్యం సాధించిన భజరంగ్ పూనియాలను ఏపి సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం రూ.6కోట్లు బహుమతిని ప్రకటించింది. గ్రూప్ -1 ఉద్యోగంతో పాటు మరికొన్ని రాయితీలను ఇస్తామని తెలిపింది.