రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఏపికి విచ్చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. తర్వాత 11.45 గంటలకు పోరంకి లో రాష్ట్రపతికి పౌరసన్మానం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్రపతి రాకకు గౌరవార్ధం ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన విందును దేశ ప్రధమ పౌరురాలు స్వీకరించనున్నారు.
అనంతరం మధ్యాహనం 2.45 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి విశాఖకు వెళ్లనున్నారు. 3.45 గంటలకు రాష్ట్రపతి ముర్ము విశాఖ ఐఎన్ఎస్ డేగా చేరుకోనున్నారు. అక్కడ సాయంత్రం వరకూ విశ్రాంతి తీసుకుని 6 గంటలకు ఆర్కే బీచ్ లో నౌకదళ ప్రదర్శన ను రాష్ట్రపతి తిలకించనున్నారు. రక్షణ, ఉపరితల రవాణా శాఖల వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ముర్ము ప్రారంభించనున్నారు. అంతే కాకుండా కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ప్రాజెక్టు, కృష్ణాజిల్లా నిమ్మలూరులోని భెల్ ప్రాజెక్టు పరిశ్రమ, రాయచోటి – అంగలూరు మధ్య హైవే ప్రాజెక్టు, నాలుగు వరసల ఆర్ వో బీకి ప్రారంభోత్సవం, కర్నూలు ఐటీసీ జంక్షన్ లో ఆరు వరుసల స్లిప్ రోడ్, ముదిగబ్బ – పుట్టపర్తి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, రాజమహేంద్రవరంలోని ఏకలవ్య మోడల్ స్కూల్, సైన్స్ సెంటర్ లను రాష్ట్రపతి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.
విశాఖలోని నౌకాదళ దినోత్సవ కార్యక్రమం అనంతరం రాత్రి 8 గంటలకు బయలుదేరి తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి తిరుమల లోని పద్మావతి అతిధి గృహంలో బస చేయనున్నారు. రేపు (సోమవారం) ఉదయం శ్రీవారిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకుంటారు. తదుపరి 10.40 గంటలకు పద్మావతి కళాశాల విద్యార్ధినులతో సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుండి 1.40 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.