ఎస్సీ యువకుడు ఇండుగుమిల్లి ప్రసాద్ కు పోలిస్ స్టేషన్ లో శిరోముండనం చేయడం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. చిన్న గొడవతో ప్రారంభమై ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి కార్యాలయమే ఈ ఘటనపై దృష్టి పెట్టేలా చేసింది. జూలై నెలలో జరిగిన ఈ ఘటనపై దళిత సంఘాలు, యువకుడి కుటుంబసభ్యులు డిమాండ్లతో కలకలం రేగింది. పోలీసులు వ్యవహరించిన తీరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ సైతం స్పందించారు. ఇప్పటికే ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించార తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ. ఘటనపై పూర్తి వివరాలు అందాక తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ కూడా తెలిపారు.
రాష్ట్రపతి కార్యాలయం స్పందనతో కలకలం..
నిందితులకు శిక్ష పడలేదంటూ బాధితుడు ఏకంగా రాష్ట్రపతికి పెట్టుకున్న ఓ అర్జీ ఈ కేసను ఇప్పుడు కీలక మలుపు తిప్పింది. ‘నేను నక్సలైట్లలో కలవడానికి అనుమతి ఇవ్వండి‘ అని రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నాడు ప్రసాద్. దీంతో రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్ర పరిపాలన విభాగం సహాయ కార్యదర్శి జనార్ధన్ బాబుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి గతంలో ఆదేశాలు వచ్చాయి. అయితే.. అక్కడి నుంచి స్పందన లేదని ప్రసాద్ తెలపడంతో.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రిత్వ శాఖకు కేసును బదిలీ చేస్తూ మరో ఉత్తర్వులు రిజిస్టర్ పోస్టులో అందాయి. ఈ కేసును అత్యవసర విషయంగా పరిగణించాలని కూడా రాష్ట్రపతి కార్యదర్శి అశోక్ కుమార్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోలీసులు చిత్రహింసలు పెట్టారు..
‘ఊళ్లో జరిగిన యాక్సిడెంట్ లో బాధితుడిని కాపాడేందుకు వెళ్లాం. ట్రాఫిక్ ఆగడంతో కారులో వచ్చిన వ్యక్తి ఆగ్రహంతో కారు దిగాడు. అతని డోర్ తగిలి నాకు ముక్కు నుంచి రక్తం వచ్చింది. కోపంతో నేను కారును చేతితో గుద్దాను. దీంతో నన్ను బూతులు తిట్టాడు. తర్వాత పరిణామాలతో పోలీస్ కేసు అయింది. సీతానగరం పోలీసులు నన్ను అరెస్ట్ చేసి స్టేషన్ లో చిత్రహింసలు పెట్టారు. స్థానిక వైసీపీ నాయకుడి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకొని బెల్ట్తో కొట్టారు. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా అంటూ.. శిరోముండనం చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను ఆపినందుకే నాపై దాడి చేశారు.’ అని ప్రసాద్ గతంలో తెలిపాడు. ఈ కేసు మరెన్ని ములుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.