రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. అందరూ ఊహించినట్లుగానే ప్రత్యర్ధి యశ్వంత్ సిన్హా పై ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 104 మంది ఎమ్మెల్యేలు, 17 మంది విపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఊహించినదాని కంటే అధిక మెజార్టీ లభించింది. తొలి సారిగా ఆదివాసీ మహిళకు అవకాశం దక్కనుండటంతో ఆయా పార్టీల స్టాండ్ కు భిన్నంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. ఈ విజయంతో రాష్ట్రపతి పీఠం అధిష్టించే తొలి ఆదివాసి మహిళగా చరిత్ర లో నిలిచిపోనున్నారు ద్రౌపది ముర్ము. మూడో రౌండ్ ముగిసే సమయానికి ద్రౌపది ముర్ము 50 శాతం మార్కు దాటేశారు. ద్రౌపది ముర్ముకు మూడవ రౌండ్ ముగిసే సమయానికి ఓటు విలువ 5,77,777 కాగా, యశ్వంత్ సిన్హాకు పోలైన మొత్తం ఓటు విలువ 2,61,062 గా ఉంది.
ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ
భారత 15వ రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ద్రాపది ముర్ము నివాసానికి వెళ్లి అభినందలు తెలియజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో కలిసి ఆమె నివాసానికి వెళ్లిన మోడీ .. పుష్పగుఛ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అజాద్ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఓ ఆదివాసి గ్రామీణ మహిళ రాష్ట్రపతి గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు మోడీ. విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించడంతో బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ద్రౌపది ముర్ము నివాసం వద్ద ఆదివాసి సంప్రదాయ నృత్యాలతో వేడుకలు చేసుకుంటున్నారు. మరో పక్క ద్రౌపది ముర్ము స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు అందరూ సంబరాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు ద్రౌపది ముర్మకు అభినందనలు తెలియజేస్తున్నారు.