అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అయితే అందులో పాల్గొననున్న ఓ అర్చకుడికి కరోనా సోకింది. అలాగే ఆ కార్యక్రమానికి గాను బందోబస్తు నిర్వహిస్తున్న మరో 16 మంది పోలీసు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.
అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజలో పాల్గొననున్న అర్చకుడు ప్రదీప్ దాస్కు కరోనా సోకింది. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా అయోధ్య రామజన్మభూమిలో పర్యటించి భూమి పూజ పనులను పర్యవేక్షించారు. ఆయన వెంట ప్రదీప్ దాస్ కూడా ఉన్నారు. అలాగే ముఖ్య అర్చకుడు సత్యేంద్ర దాస్ కూడా ప్రదీప్ దాస్ వెంటే ఉన్నారు. దీంతో అందరూ అలర్ట్ అయ్యారు. అయితే కరోనా కేసులు నమోదైనప్పటికీ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
అయోధ్యలో ప్రస్తుతం 375 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యూపీలో మొత్తం 29,997 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ అయోధ్యలో భూమి పూజ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆ కార్యక్రమానికి మోదీ సహా మొత్తం 150 మంది వరకు అతిథులు హాజరవుతారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ కార్యక్రమం నిర్వహిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.