కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీ వాద్రాకు దక్షిణాది రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి నియమించాలని పార్టీ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న పార్టీ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసీ) భేటీ తరువాత ఈ నిర్ణయానికి సంబంధించి ప్రకటన వెలువడనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పార్టీ ఇన్ చార్జిగా ప్రియాంక గాంధీ వ్యవహరించనున్నారు. ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల పార్టీ శాఖలకు ప్రియాంక పూర్తి స్థాయి ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.
ఒ పక్క భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటికే తెలంగాణలో పాగా వేయడానికి దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ బలోపేతానికి వ్యూహాలను సిద్దం చేసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించింది. అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులు తరచు తెలంగాణలో పర్యటిస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. తెలంగాణలో పార్టీ నేతల మధ్య విభేదాల కారణంగా బలోపేతానికి ఇబ్బందలు ఎదురవుతున్నాయి. గ్రూపు విభేదాలే ఆ పార్టీకి శాపంగా మారాయనే మాట వినబడుతోంది. కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక ఏపి, తెలంగాణ తో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలోపేతంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ లు బలోపేతం కాలేకపోతున్నాయి. ఈ తరుణంలో ప్రియాంక గాంధీకి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఏ మేరకు సఫలం అవుతారో వేచి చూడాలి.