అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను అశ్వనీదత్కు వివరించారు. రాజధాని కోసం తాము భూములు ఇచ్చిన విషయాన్ని, ప్రభుత్వం మారగానే అమరావతి చుట్టూ జరుగుతోన్న పరిణామాలను అశ్వనీదత్కు తెలిపారు.
మరోవైపు మందడంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ రైతులు ఆందోళనలను విరమించకుండా నిరసనలను కొనసాగిస్తున్నారు. ఓ ప్రైవేటు స్థలంలో కూర్చొని రైతులు నిరసన తెలుపుతున్నారు.
కాగా, రాజధాని రైతులకు క్రమంగా టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ నటుడు నారా రోహిత్, గాయని స్మిత తదితరులు మద్దతు తెలిపారు. తాజాగా నిర్మాత అశ్వనీదత్ కూడా సంఘీభావం ప్రకటించారు.