ఓ న్యూస్ ఛానెల్ ప్రమోటర్గా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్గా ప్రస్థానం మొదలుపెట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్. ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ ఈ టీవీలో ప్రసరమవుతున్న “జబర్ధస్త్ కామెడీ షో “తో మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. తనదైన నటనా సౌందర్యంతో ప్రేక్షకులు టీవీల ముందే కట్టిపడేశారు. కంటెస్టెంట్ల కామెడీ పంచులు.. అనసూయ అందాలతో జబర్ధస్త్ తిరిగులేని రేటింగ్స్తో దూసుకుపోయింది.
దీంతో అనసూయకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు మస్తు పాపులారిటీ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే, కథలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ.. వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమాలో ఆమె నటన అద్బుతం. రంగమ్మత్త పాత్రలో నటించి.. రంగమ్మత్త అంటే అనసూయనే గుర్తొచ్చేలా చేశారంటే.. ఆమె నటన ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా ఆమె తన హవాకొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ, అల్లు అర్జున్ పుష్ప సినిమాల్లో నటిస్తున్నారు అనసూయ.
అయితే, ఇలా రేసుగుర్రంలా కెరియర్ దూసుకుపోతున్న తరుణంలో టాలీవుడ్ బడా నిర్మతా ఒకరు ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారట. ఏంటిది అనుకుంటున్నారా? గురుపవన్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో టాలీవుడ్ బిగ్ ప్రొడ్యుసర్ కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో అనసూయ ఓ లీడ్ రోల్ లో నటించాల్సి ఉన్నది. అయితే, ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో తన నిర్ణయాన్ని తెలుపకుండా.. నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోందట అనసూయ. దీంతో ఆమెను ఆ సినిమా నుంచి తప్పించినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు దూరం కావడమే కాకుండా మరిన్ని ప్రాజెక్టులపై ఈ ప్రభావం పడిందని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది.