విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదికి నిరసనలు స్వాగతం చెప్పనున్నాయి. ఈరోజు సాయంత్రం ఆయన రైల్వే స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
విశాఖ జోన్ పేరుతో మోదీ మళ్లీ మోసానికి పాల్పడ్డారంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి, వామపక్ష పార్టీలు ‘మోది గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
విశాఖ నగరంలో మోదీకి వ్యతిరేకంగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. జివిఎమ్సి గాంధీ విగ్రహం వద్ద టిడిపి నేతలు నిరసలు చేపట్టారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిడారి శ్రవణ్, స్థానిక ఎమ్మెల్యేలు ఈ నిరసనలో పాల్గొన్నారు.
గాంధీ విగ్రహం వద్ద గత మూడు రోజులుగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు కోరుతూ ఇనుప సంకెళ్లు ధరించి నిరాహార దీక్ష చేస్తున్నారు.
దొండపర్తి డిఆర్ఎమ్ కార్యాలయం వద్ద వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వామపక్ష రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు దేవినేని అవినాష్ అద్వర్యంలో ఆందోళన చేపట్టారు. బెంజ్ సర్కిల్ లో తెలుగు యువత కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. మోది గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
మోది రాకకు నిరసనగా మరోసారి ముఖ్య మంత్రి చంద్రబాబు నల్ల చొక్కా ధరించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షకు నల్ల చొక్కాతో హాజరయ్యారు.
కాకినాడలో ఏపి పిసిసి అధ్యక్షడు రఘువీరా రెడ్డి అధ్యర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తలకు నల్ల రిబ్బన్ ధరించి నేతలు నిరసన తెలుపుతున్నారు.