ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదికి పౌరసత్వం బిల్లు నిరసన సెగ ఎదురయింది. అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న పౌరసత్వ బిల్లు ప్రధానికి గోబ్యాక్ ప్లెకార్డులు చూపిస్తున్నది.
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాని మోది శనివారం ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ, ర్యాలీలు, సభల్లో ప్రసంగిస్తున్నారు.
పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు ఇండియా పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వం బిల్లును జనవరి ఎనిమిదిన లోక్సభ ఆమోదించింది.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలు దీనిని నిరసిస్తున్నారు. మేఘాలయ, మిజోరాం, మణిపూర్ ముఖ్యమంత్రులు ఈ బిల్లు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అస్సోంలోనూ పెద్ద ఎత్తున ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.
రెండు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోది శుక్రవారం అస్సోం రాజధాని గువాహతికి చేరుకున్నారు. మోది వాహన శ్రేణికి అక్కడ అఖిల అసోం విద్యార్థి సంఘం నేతలు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు బయలుదేరగా మరో సారి నిరసన ఎదురైంది. ఆందోళనకారులు నల్లజెండాలు ఊపుతూ పౌరసత్వ విల్లుపై తమ వ్యతిరేకతను ప్రదర్శించారు. నిరసనల మధ్యే ప్రధాని మోది పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని హూలంగిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి మోది శంకుస్థాపన చేశారు.
ఇటానగర్లో దూరదర్శన్ అరుణ ప్రభ ఛానల్ను మోదీ ప్రారంభిచనున్నారు. అక్కడ నుండి మళ్లీ గువాహతికి చేరుకుని బ్రహ్మపుత్ర నదిపై ఆరు లైన్ల వంతెనకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం త్రిపురలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి సభల్లో ప్రసంగించనున్నారు.