Puligundu: ఏపిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి నుండి 50 కిలో మీటర్ల దూరంలో పెనుమూరు ప్రాంతంలో చుట్టూ మైదానం..మద్యలో భూమి లోపల నుండి బయటకు చొచ్చుకొచ్చినట్లు కనిపించే అతి పెద్ద రాతి పర్వతం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ రాతి పర్వతం విశేషం ఏమిటంటే రెండు అతి పెద్ద రాతి పర్వతాలు లింగాకృతిలో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సుమారు వెయ్యి అడుగుల ఎత్తు ఉన్న ఈ కొండపైకి ఎక్కితే సుదూరంలో ఉన్న తిరుపతి పర్వతాలు, చుట్టుపక్కల అటవీ ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి.
ఇక్కడకి పర్యాటకులు వెళ్లేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రెండుగా చీలినట్లు కనిపించే ఈ పర్వతాలను పార్వతీ, పరమేశ్వరులుగా కొలుస్తుంటారు భక్తులు. పూర్వకాలంలో ఈ కొండ గుహల్లో పులులు తలదాచుకునేవనీ, అందుకే ఈ ప్రాంతానికి పులిగుండు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. ట్రైక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు ఎక్కువగా పులిగుండును సందర్శించేందుకు ఇష్టపడుతుంటారు.
పులిగుండు పర్వతం మీదకు ఎక్కేందుకు రాతి మెట్లు, ఇనుప మెట్ల మార్గాలు ఉన్నాయి. వీటి మీద నుండి పైకి చేరడమంటే సాహసం చేసినట్లే. పూర్వం ఇక్కడ మెట్లు ఉండేవి కాదు. భక్తులు నిచ్చెనలు, తాళ్ల సాయంతో కొండపైకి చేరుకునే వారు. కొండపైన శివాలయం, అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి. మెట్ల మార్గంలో గణపతి, వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ తల్లి విగ్రహాలు దర్శనమిస్తాయి. పులిగుండు దిగువన పులిగుండేశ్వర ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి.
ఇక్కడ ప్రతి ఏటా సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. కనుమ రోజున పులిగుండేశ్వరస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పులిగుండు సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.