విజయవాడ, జనవరి 13: పెనమలూరు నియోజకవర్గం వణుకూరులో మట్టి తవ్వకాల వ్యవహారం విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్, పెనమమూరు ఎమ్మెల్యే బొడె ప్రసాద్ల మధ్య ఘర్షణగా మారింది. ఎమ్మెల్యే చర్యలను సబ్ కలెక్టర్ మిషా సింగ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వివరాల్లోకి వెళితే…
పెనమలూరు మండలం పుల్లేరు పోరంబోకు స్థలంలో మట్టిని తీసి స్థానికులు గట్టు పటిష్టం చేస్తుండగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని అధికారులు యంత్రాన్ని (ప్లోక్లైయిన్) సీజ్ చేశారు. సీజ్ చేసిన యంత్రాన్ని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సీజ్ చేసిన వాహనాన్ని తన వెంట తీసుకువెళ్లిపోయారు.
సీజ్ చేసిన వాహనాన్ని ఎమ్మెల్యే, ఎంపిపిలు బలవంతంగా తీసుకువెళ్లడం ఎమిటంటూ సబ్ కలెక్టర్ మీషా సింగ్ నిన్న రాత్రి పుల్లేరు పోరంబోకు భూమిని స్వయంగా పరిశీలించారు. తహశీల్ధార్, ఆర్ఐ, విఆర్ఒలతో పాటు పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోరంకిలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతున్న సమయంలో అధికారులు, పోలీసులతో సబ్ కలెక్టర్ అక్కడకు చేరుకుని సీజ్ చేసిన వాహనాన్ని తమకు అప్పగించాలని కోరారు. రైతుల తప్పేమీ చేయలేదని, అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ను కోరారు. సీజ్ చేసిన వాహనాన్ని అప్పగించే ప్రశ్నే లేదని, అవసరమైతే తనను అరెస్టు చేసి తీసుకువెళ్లాలన్నారు. ఇద్దరి మధ్య వివాదం తారా స్థాయికి చేరడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సబ్ కలెక్టర్ మీషా సింగ్ జరిగిన విషయాన్ని జాయింట్ కలెక్టర్, కలెక్టర్లకు నివేదించారు.
‘రైతులు తప్పులేకపోయినా సబ్ కలెక్టర్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ, భారీగా జరిమానా విధించారని’ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సబ్ కలెక్టర్పై ఫిర్యాదు చేయడానికి ఆయన నివాసానికి వెళ్లగా చంద్రబాబు వేరే పనుల్లో ఉండటంతో సిఎం సూచనపై ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రను కలిసి సబ్ కలెక్టర్తో జరిగిన వివాదం గురించి వివరించారు.
సబ్ కలెక్టర్ మీషా సింగ్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ల వాగ్వివాదం చూసేందుకు ఈ కింద క్లిక్ చేయండి