ఢిల్లీ, మార్చి 11 : జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వీరిలో పుల్వామా ఆత్మాహుతి దాడి ప్రధాన సూత్రధారి ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహద్ భాయ్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
త్రాల్ సమీపంలోని పింగ్లష్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. తనిఖీలు జరుపుతుండగా ఒక ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులకు దిగారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
సైన్యం కాల్పుల్లో హతమైన ఉగ్రవాది మహద్ స్వస్థలం పుల్వామా జిల్లా త్రాల్ పట్టణంలోని మిర్ మొహల్లా. మహద్ ఎలక్ట్రీషియన్గా ఐటిఐలో డిప్లొమా కోర్సు చేశాడు. పుల్వామా ఆత్మాహుతి దాడికి అతడే వాహనం,పేలుడు పదార్థాలను సమకూర్చినట్టు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఆత్మాహుతి చేసుకున్న అదిల్ అహ్మద్ దార్ దాడికి ముందు మహద్తో చాలా రోజుల పాటు సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది.
మహద్ 2017లో గ్రౌండ్ వర్కర్ గా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. తర్వాత కశ్మీర్లో ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసే నూర్ మహ్మద్ తాంత్రే అనుచరుడిగా ఉన్నాడు. 2017 డిసెంబరులో నూర్ను భారత సైన్యం మట్టుబెట్టడంతో 2018 జనవరి 14 నుంచి అజ్ఙాతంలోకి వెళ్లిపోయి, ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు.
2018 ఫిబ్రవరిలో సుంజ్వాన్ ఆర్మీ స్థావరంపై దాడికి పాల్పడి ఆరుగురు జవాన్లను చంపిన ఘటనతోనూ ఇతడికి సంబంధం ఉంది. అలాగే 2018 జనవరిలో లేత్పోర్ సిఆర్పిఎఫ్ క్యాంపుపై జరిగిన దాడిలోనూ మహద్ హస్తముంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించారు.