Panjab: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు వచ్చింది. పీసీసీ నేత సిద్దూ, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో చివరకు సిద్దు పై చేయి సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దూ నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.తన రాజీనామ లేఖను గవర్నర్ ను కలిసి అందజేశారు అమరీందర్ సింగ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
సిద్ధూతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేయాలన్న సంచలన నిర్ణయాన్ని అమరీందర్ సింగ్ తీసుకున్నట్లు సమాచారం. తాను అధికారంలో కొనసాగలేనంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. సోనియా మాట ప్రకారం ఇన్నాళ్లూ అన్ని రాజకీయ మార్పులకు అంగీకరించాననీ కానీ ఇకపై పార్టీలో కొనసాగలేనని అమరీందర్ సింగ్ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ అవమానాలు చాలు, ఇలా జరగడం ఇది మూడవ సారి అని అమరీందర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
గత కొంత కాలంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ పై ఒక వర్గం ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తొలుత పీసీసీ పగ్గాలు సిద్ధూకు అప్పగించే విషయంపైనా పార్టీలో దుమారం చెలరేగింది. సిద్దూకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించడానికి అమరీందర్ సింగ్ అంగీకరించలేదు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం సిద్ధూకే మొగ్గు చూపింది.
Submitted my resignation to Honble Governor. pic.twitter.com/sTH9Ojfvrh
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 18, 2021