రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర నేతల ఆందోళన పిలుపు నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి గారు మాట్లాడుతూతూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం సంఘటనతో సహా రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా దేవాలయాలపై దాడులు జరిగిన అన్ని సంఘటనలపైనా CBI విచారణ చేయడమే సరైనదని అన్నారు.
డౌట్ పడకుండా ఉండలేరట
అంతర్వేది గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం సంఘటన యావత్ రాష్ట్రంలోని హిందూ ప్రజల హృదయాలను దారుణంగా గాయపరిచిందనీ పురంధేశ్వరి తెలిపారు. ఈ సంఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరచాయని స్పష్టం చేశారు. హిందూ దేవాలయ వ్యవస్థలను పతనం చేయాలన్న రీతిలో సాగుతున్న చర్యలు హిందూ భక్తులను మరింత కలవరపెడుతున్నాయని వాపోయారు. హిందూ దేవాలయ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల మాటలు, చేతలు వారి చిత్తశుద్ధిపై సందేహాలు కలిగించక తప్పదని అన్నారు. రాష్ట్రంలోని ఆలయాలకు రక్షణ కొరవడుతోందన్న భావం హిందూ భక్తులలో రోజురోజుకూ పెరుగుతోందని మండిపడ్డారు.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
గతంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విగ్రహాల విధ్వంసం, నెల్లూరు జిల్లా బిట్రగుంట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క రథం తగలబెట్టడం, పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో అమ్మవారి దేవాలయ ప్రవేశ ద్వారం ధ్వంసం చేయడం లాంటి అనేక సంఘటనలలో ఎవ్వరినీ శిక్షించకుండా ఈ పనులన్నీ పిచ్చివాళ్ళ చేష్టలుగా చూపించే ప్రయత్నం చేయడం ఇటువంటి సంఘటనలు పెరగడానికి దోహదపడ్డాయని పురంధేశ్వరి మండిపడ్డారు. హిందూ దేవాలయాల, ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం ఇటువంటి సంఘటనలకు కారణమన్నది నిర్వివాదాంశం అని అన్నారు.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట
రాష్ట్ర ప్రభుత్వ ధోరణి పోలీసులను , అధికారులను ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చిన్న చిన్న సంఘటనలుగా , పిచ్చి వాళ్ళ , ఆకతాయిల పనులుగా చిత్రీకరించేలా ప్రేరిపిస్తున్నాయని పురంధేశ్వరి స్పష్టం చేశారు . హిందూ దేవాలయ ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకోవడం, అన్యాక్రాంతం కావడం దారుణమని అన్నారు. అన్నీ తెలిసినా దేవాదాయ శాఖ అధికారులు మరియు ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని దేవాలయ భూములు వేల ఎకరాలు అన్యాక్రాంతం గురవుతున్నాయని మండిపడ్డారు. అంతర్వేది రథం దగ్ధం సంఘటనతో సహా గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగిన అన్ని సంఘటనలపైనా CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించడానికి వెళ్ళిన హిందువులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. మనోభావాలు గాయపడ్డ భక్తుల శాంతియుత నిరసనలను అడ్డగించడానికి వివిధ స్థలాలలో ఆటంకాలు ఏర్పరచడం ,ప్రశ్నించే వాళ్లను అణిచి వేయాలని ప్రయత్నం చేయడం వంటి చర్యలు రాష్ట ప్రభుత్వ హిందువులను అణచివేసినట్లుగా భావిస్తున్నామనీ అన్నారు .హిందూ భక్తులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకుని రథం దగ్ధం కావడానికి కారణమైన దోషులను శిక్షించవలసినదిగా డిమాండ్ చేశారు.