స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా పుష్ప. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కాగా భారీ స్థాయిలో ఈ సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఫైనల్ అయినట్టు సమాచారం.
అయితే లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాలు షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప యూనిట్ కూడా షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారట. లాక్ డౌన్ కి ముందు అనుకున్న కేరళ ఫారెస్ట్ లోనే మళ్ళీ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయగా మళ్ళీ అక్కడి నుంచి లొకేషన్ మార్చినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా ఉన్న కేరళ ప్రాంతంలో కరోనా కేసులు కూడా విపరీతంగా రోజు రోజుకీ పెరుగుతున్నాయట. ఈ కారణంగా ఇప్పుడు కేరళలో షూటింగ్ జరపడం అంత మంచిది కాదని భావించిన పుష్ప యూనిట్ షూటింగ్ లొకేషన్ ని రాజమండ్రి దగ్గరలోని మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియా కి మార్చుకున్నట్టు సమాచారం.
అంతేకాదు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరిపేందుకు మొత్తం చిత్ర యూనిట్ షెడ్యూల్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా రిసార్ట్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈసారైనా సుకుమార్ ప్లాన్ వర్కౌట్ అయి ఈ లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందా లేదా చూడాలి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ – పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచిన సంగతి తెలిసిందే.