Pushpa : బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలు పోటీ పడితే ఆ సినిమా హీరోల మధ్య..అభిమానుల మధ్య ఉండే టెన్షన్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అలాంటి రెండు పాన్ ఇండియన్ సినిమాలు త్వరలో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయని నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2. ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ ఉండబోతుందని టాక్ మొదలైంది.
వాస్తవంగా యష్ నటించిన కేజీఎఫ్ 2 ను జులైలో అలాగే పుష్ప సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజుల్లోనే కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోయాయి. దాంతో పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఆ కారణంతో అన్నీ సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోయాయి. అయితే కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి రెడీగా ఉంది. కాగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా పార్ట్ వన్ తాజాగా సెట్స్ మీదకి వచ్చింది. 45 రోజుల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం వీటి రిలీజ్ డేట్ విషయంలో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయట.
Pushpa : డిసెంబర్ 25న బాక్సాఫీస్ వద్ద పుష్ప వర్సెస్ కేజీఎఫ్ 2
కేజీఎఫ్ 2ను అక్టోబర్లో అని టాక్ వినిపిస్తోంది. అయితే థియేటర్లు ఆ సమయానికి పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్లో కేజీఎఫ్ 2 విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలకి సన్నాహాలు చేస్తున్నారట. పుష్ప మొదటి పార్ట్ ను ఆగస్టులో రిలీజ్ చేయాల్సింది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే నిజమైతే ఈ డిసెంబర్ 25న బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ ఉండటం ఖాయమంటున్నారు.